Virat Kohli: సింహాద్రి అప్పన్న సేవలో విరాట్ కోహ్లీ
సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించడమే కాకుండా 2-1 తేడాతో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా ప్లేయర్లు విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్ సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు.
విశాఖ, డిసెంబర్ 07: సింహాద్రి శ్రీవరాహ లక్ష్మీనరసింహ స్వామిని టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) దర్శించుకున్నారు. ఆయనతో పాటు యంగ్ ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ కూడా ఉన్నారు. అంతకు ముందు ఆలయ అధికారులు కోహ్లీకి, సుందర్ కు స్వాగతం పలికారు. వారికి అప్పన్న స్వామిని దర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. విరాట్ కోహ్లీ ఆలయం(Simhachalam Temple)లోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకొని బేడా మండపం చుట్టూ ప్రదక్షిణ చేశాడు. గర్భగుడిలోని అప్పన్న స్వామిని దర్శించుకొని పూజలో పాల్గొన్నాడు. దర్శనానంతరం వారికి అర్చకులు వేదాశీర్వచనం చేశారు. స్వామి వారి చిత్రపటం, తీర్థప్రసాదాలను విరాట్, సుందర్(Washington Sundar) లకు అధికారులు అందజేశారు.
ఇక భారత క్రికెటర్ల కోహ్లీ, వాషింగ్టన్ సుందర్ రాకతో అప్పన్న ఆలయం(Simhachalam Temple)లో కాసేపు సందడి నెలకొంది. క్యూలైన్లలో ఉన్న భక్తులు కోహ్లీని చూసి.. తెగ సంబరపడ్డారు. కొందరు దూరం నుంచి సెల్ఫీలు సైతం తీసుకున్నారు. ఇక విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్ విషయానికి వస్తే… మూడో వన్డేలో టీమిండియా అలవోకగా విజయం సాధించింది. అంతేకాక 2-1 తేడాతో సిరీస్ను చేజెక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ సహా 302 పరుగులు సాధించాడు. ఈ సిరీస్లో అద్భుత ప్రదర్శన చేసినందుకు విరాట్ కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’(Kohli Player of the Series) అవార్డు దక్కింది. విశాఖలో విరాట్కు మంచి రికార్డు ఉంది. సింహాద్రి అప్పన్న ఆశీస్సులు ఎప్పుడూ కోహ్లీకి ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.
