TG News: మావోయిస్టు అగ్రనేత దేవా లొంగుబాటు.. భారీగా ఆయుధాలు, నగదు స్వాధీనం: డీజీపీ
హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత బర్సే సుక్కా అలియాస్ దేవా, తెలంగాణకు చెందిన రాజిరెడ్డి అతని భార్యతో పాటు 20 మంది సభ్యులు భారీగా ఆయుధాలు, నగదు అప్పగించి తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి ఎదుట లొంగిపోయారు. నిన్ననే లొంగిపోగా.. ఆ వివరాలను డీజీపీ శనివారం మీడియాకు వెల్లడించారు. మావోయిస్టు పార్టీ గెరిల్లా ఆర్మీ చీఫ్గా దేవా పని చేస్తున్నారు. లొంగిపోయిన వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను, రూ. 20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. హెలికాప్టర్లను కూల్చేందుకు వాడే సామగ్రి కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ లొంగుబాటు పీఎల్జీఏకు భారీ దెబ్బగా భావిస్తున్నట్లు చెప్పారు.
‘‘దేవా.. హిడ్మా సొంత గ్రామానికి చెందిన వాడు. ఎన్ఐఏ నుంచి దేవాపై రూ.75లక్షల రివార్డు ఉంది. ఆవులం సోమా, భేమే, సుశీల, వేముల రాజు, నందయ్యా, మంకు, అండా, తెలంగాణ స్టేట్ కమిటీ సభ్యురాలు అడ్లూరి ఈశ్వరి లొంగిపోయినవారిలో ఉన్నారు. 2 lmg, యూఎస్ఏ తయారీ కోల్ట్ ఆయుధంతో వచ్చారు. ఇజ్రాయెల్ దేశంలో తయారు చేసిన టవర్ ఆయధం కూడా ఉంది. ఎనిమిది ఏకే 47 గన్స్ స్వాదీనం చేసుకున్నాం. SLR 8, నాలుగు బ్యారేల్ గ్రానైడ్ లాంచర్స్ ఆయుధాలను సమర్పించారు. హెలికాప్టర్ను సైతం కూల్చే భారీ ఆయుధం సైతం తీసుకు వచ్చారు.
పీఎల్జీఏ బెటాలియన్లో 400 మంది సభ్యులు ఉండగా.. ప్రస్తుతం 66 మంది మాత్రమే మిగిలారు. పీఎల్జీఏ పూర్తిగా క్షీణించింది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కిష్టంపేట్కు చెందిన రాజిరెడ్డి లొంగుబాటుతో ఇంకా రాష్ట్రానికి చెందిన ఒక్కరు మాత్రమే స్టేట్ కమిటీలో ఉన్నారు. సీఎం రేవంత్రెడ్డి పిలుపుతో మావోయిస్టులు ఆత్మ సమర్పణ చేసుకున్నారు. డివిజన్ సభ్యులకు రూ.5లక్షలు, ఏరియా సభ్యులకు రూ.4లక్షలు, మిగతా సభ్యులకు రూ.లక్ష రివార్డు ఉంది. రూ.1.80 కోట్ల రివార్డు లొంగిపోయిన మావోయిస్టులకు అందిస్తాం. తక్షణ సాయం కింద ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున ఇస్తాం. ఇప్పటి వరకు తెలంగాణలో 576 మంది మావోయిస్టులు లొంగిపోయారు. పీఎల్జీఏ సమాచారం ప్రకారం ప్రస్తుతం తెలంగాణ నుంచి 17 మంది సభ్యులు మిగిలి ఉన్నారు. మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలని కోరుతున్నాం’’ అని డీజీపీ తెలిపారు.
