Chandrababu: ఏపీలో పెట్టుబడుల ఊపు.. కొత్త సంవత్సరానికి బలమైన ఆరంభం: చంద్రబాబు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల ఊపు కొత్త సంవత్సరానికి బలమైన ఆరంభమని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫలితాలు సుస్పష్టమని పేర్కొన్నారు. పాలసీ సంస్కరణలతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగిందని తెలిపారు. దేశీయ పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలవడం ప్రజలకు శుభవార్త అన్న ఆయన.. ముందుచూపుతో అమలు చేస్తున్న పాలసీ సంస్కరణల ప్రభావం ఇదని వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కార్యక్రమాల ద్వారా పెట్టుబడిదారులకు వేగవంతమైన సేవలు అందుతున్నాయన్నారు.
ప్రోత్సాహకాల పంపిణీలో పారదర్శకత కోసం ఎస్క్రో ఆధారిత వ్యవస్థను ప్రవేశపెట్టామని వెల్లడించారు. రంగాలవారీగా స్పష్టమైన విధానాలు అమల్లోకి తీసుకొచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడుల గమ్యస్థానంగా ఎంచుకున్న ఇన్వెస్టర్లకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. విజన్పై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ బృందం చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. ఇది విజయానికి ముగింపుగా కాకుండా.. భవిష్యత్ అభివృద్ధికి పునాదిగా అభివర్ణిద్దామని పిలుపునిచ్చారు. పెట్టుబడులు, భాగస్వామ్యాలు, స్థిరమైన వృద్ధిపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టిందని వెల్లడించారు.
