విదేశీ ఉపాధి అవకాశాల పెంపుకు కేంద్ర–రాష్ట్ర సమన్వయం కీలకం: మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, ఫిబ్రవరి 25: యువతకు విదేశీ ఉపాధి అవకాశాలను విస్తరించాలంటే నైపుణ్య శిక్షణ, సరైన కోర్సుల ఎంపిక, పాస్పోర్ట్ సేవలు, ఇమిగ్రేషన్ విధానాల్లో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అత్యవసరమని కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి డా. జీ. వివేక్ వెంకటస్వామి అన్నారు.
సచివాలయంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాంకేతిక నైపుణ్యాలతో పాటు విదేశీ భాషలపై శిక్షణ అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని పేర్కొన్నారు. విదేశీ నియామకాల కోసం అభ్యర్థులను సిద్ధం చేసేలా మెంటర్లు, కెరీర్ గైడ్లతో కూడిన బలమైన వ్యవస్థ అవసరమని తెలిపారు.
ప్రొఫెషనల్ కోర్సులతో పాటు భాషా శిక్షణా సదుపాయాలను విస్తరించడం ద్వారా విదేశీ ఉద్యోగాల్లో నియామకాలు పెరుగుతాయని మంత్రి వివరించారు.
సమావేశంలో సెక్రటరీ (CPV & OIA) శ్రీప్రియ రంగనాథన్, జాయింట్ సెక్రటరీ (OE) & ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ సురిందర్ భగత్, ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి (హైదరాబాద్) అజిత్ జాన్ జాషువు పాల్గొన్నారు. కేంద్రం, రాష్ట్రాలు విదేశీ నియామకాల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా సమీక్షించారు.
శ్రీప్రియ రంగనాథన్ మాట్లాడుతూ విదేశీ ఉపాధి కోరుకునే విద్యార్థులకు నిర్మిత శిక్షణ అందించేందుకు సమన్వయంతో చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. విదేశాలకు వెళ్తున్న యువతకు సాంస్కృతిక అవగాహన కల్పించడం కూడా కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆమె అభినందించారు.
కార్పొరేట్ శిక్షణా సంస్థలను విదేశీ భాగస్వాములతో అనుసంధానం చేస్తే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని, అంతర్జాతీయ సంస్థల్లో విశ్వాసం పెరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. అక్రమ వలసలను అరికట్టడం ప్రభుత్వాల ప్రధాన లక్ష్యమని, ఈ విషయంలో రాష్ట్రం సహకారం అందించాలని కోరారు. రాష్ట్ర సంస్థలు జారీ చేసే సర్టిఫికేషన్లను కేంద్ర సంస్థల ద్వారా ధృవీకరించే విధంగా సమన్వయం అవసరమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా LETF ప్రత్యేక కార్యదర్శి దాన కిశోర్, Telangana Overseas Manpower Company (టామ్కామ్) చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తూ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో ప్రొఫెషనల్స్ను తయారు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో జారీ చేస్తున్న పలు సర్టిఫికేషన్లు ఇప్పటికే National Council for Vocational Education and Training (ఎన్సీవీఈటీ) వంటి కేంద్ర సంస్థల గుర్తింపు పొందినట్లు చెప్పారు.
పాస్పోర్ట్ జారీ ప్రక్రియతో పాటు దరఖాస్తు సమయంలో సురక్షిత మరియు చట్టబద్ధ వలస విధానాలపై అవగాహన కల్పించే అంశాలపై కూడా సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
విదేశీ ఉపాధి కోరుకునే యువతకు సమగ్ర శిక్షణ, మార్గదర్శకత్వం అందించే దిశగా కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని సమావేశం నిర్ణయించింది.
