విధి నిర్వహణలో వీరమరణం.. కానిస్టేబుల్ సౌమ్య ధైర్యానికి సీపీ సజ్జనార్ సెల్యూట్
గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో దుండగులు ఎక్సైజ్ కానిస్టేబుల్ (Excise Constable) గాజుల సౌమ్య (Soumya)ను కారుతో ఢీకొట్టి పారిపోయారు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సౌమ్య శనివారం రాత్రి నిమ్స్ ఆస్పత్రి (Nimes Hospital)లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. జనవరి 23న ఈ ఘటన చోటు చేసుకొగా.. దాదాపు 9 రోజులు మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయింది. తన డ్యూటీ నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య మృతి పట్ల నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మత్తు రక్కసిని అంతం చేసేందుకు ఆమె చూపిన సాహసం వెలకట్టలేనిదని, రక్తమోడుతున్నా వెనకడుగు వేయకుండా పోరాడిన ఆమె త్యాగం నిరుపమానమని కొనియాడారు. గంజాయి మాఫియా వాహనంతో తొక్కించి కిరాతకంగా చంపడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ, సమాజ రక్షణ కోసం ప్రాణాలర్పించిన ఆ వీరనారి ధైర్యానికి మనస్ఫూర్తిగా నివాళులర్పించారు.
ఈ ఘటన కేవలం ఒక విషాదం మాత్రమే కాదని, గంజాయి మాఫియా ఎంతలా పేట్రేగిపోతుందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనమని సజ్జనార్ పేర్కొన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల ముప్పు సమాజానికి ఎంతటి ప్రమాదకరంగా మారిందో సౌమ్య మరణం హెచ్చరిస్తోందని ఆయన ట్వీట్ చేశారు. విధి నిర్వహణలో అమరురాలైన సౌమ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, మాదక ద్రవ్యాలపై పోరాటం ఆగిపోదని ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.
