హైదరాబాద్ లోని కట్ట మైసమ్మ ఆలయం ఎదుట మూత్ర విసర్జన .. ధర్నాకు దిగిన భక్తులు
మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గం సఫిల్ గూడాలోని కట్ట మైసమ్మ దేవాలయం ప్రాంగణంలో జనవరి 10న రాత్రి ఉద్రిక్తత నెలకొంది. ఆలయం ఎదుట కొబ్బరికాయలు కొట్టే స్థలంలో ఓ వ్యక్తి మలమూత్ర విసర్జన చేయడంతో హిందూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
ఈ విషయం తెలుసుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం దగ్గరకు చేరుకుని ధర్నాకు దిగారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మత కల్లోలాలు సృష్టించే ప్రయత్నాలను అడ్డుకోవాలని పోలీసులను కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
సమాచారం అందుకున్న మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని ఉన్నత పోలీసు అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, భక్తులకు న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అనంతరం భక్తులు శాంతియుతంగా ధర్నాను విరమించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
