యూరియా యాప్తో రైతులకు ఊరట.. లైన్లు లేకుండానే బస్తాల పంపిణీ
కరీంనగర్:
రాష్ట్రంలో గత వానాకాలం సీజన్తో పోలిస్తే ప్రస్తుత యాసంగి సీజన్లో రైతులకు యూరియా కోసం ఎదురైన ఇబ్బందులు గణనీయంగా తగ్గాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా రైతులు యూరియాను ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం కల్పించడంతో స్టాక్ సెంటర్ల వద్ద క్యూలు కనిపించడం తగ్గిపోయింది.
రైతులు తమకు అవసరమైన యూరియాను యాప్ ద్వారా బుక్ చేసుకుని, కేటాయించిన రోజున సమీపంలోని స్టాక్ పాయింట్కు వెళ్లి నేరుగా బస్తాలు తీసుకెళ్తున్నారు. పీఏసీఎస్లు, మార్క్ఫెడ్ గోదాములు, ప్రైవేట్ డీలర్ల వద్ద సరిపడా స్టాక్ నిల్వ ఉంచడంతో గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా పోయింది. గతంలో తమ వంతు వచ్చేసరికి యూరియా దొరుకుతుందో లేదో అన్న భయంతో రైతులు ఒకేసారి సెంటర్ల వద్ద గుమిగూడేవారు. ఇప్పుడు అవసరమైనప్పుడు మాత్రమే బుక్ చేసుకుని తీసుకెళ్తున్నారు.
నిరుడు యాసంగి సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 9,33,985 టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేశారు. అయితే ఈ యాసంగి సీజన్లో ఇప్పటివరకు 9,81,858 టన్నుల యూరియా అమ్ముడైంది. గతేడాదితో పోలిస్తే సుమారు 50 వేల టన్నుల వరకు అదనంగా అమ్మకాలు జరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని స్టాక్ సెంటర్లలో కలిపి 60,040 టన్నుల యూరియా అందుబాటులో ఉందని కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు.
యాప్తో తగ్గిన ఇబ్బందులు
ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్పై మొదట్లో రైతులకు అవగాహన లేక కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ప్రస్తుతం తమ పిల్లలు లేదా పరిచయస్తుల సహాయంతో యాప్ను డౌన్లోడ్ చేసుకుని పాస్బుక్కు లింక్ చేసిన మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయి భూమి వివరాలు నమోదు చేసి యూరియాను బుక్ చేసుకుంటున్నారు.
కౌలు రైతులు సిటిజన్ అకౌంట్ ద్వారా యూరియాను బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. భూమి యజమాని మొబైల్కు వచ్చే ఓటీపీ ద్వారా ధృవీకరణ చేసుకుని బుకింగ్ పూర్తి చేయవచ్చు. ఇంటి నుంచే బుకింగ్ చేసి, బుకింగ్ ఐడీతో మండలంలోని ఏ స్టాక్ పాయింట్ నుంచైనా యూరియా తీసుకునే సౌకర్యం కల్పించడంతో రైతులకు పెద్ద ఊరట లభిస్తోంది.
జిల్లాల వారీగా అమ్మకాలు
ఈ యాసంగి సీజన్లో రాష్ట్రంలోని 32 జిల్లాల్లో గత ఏడాదితో పోలిస్తే యూరియా అమ్మకాలు పెరిగాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 76,420 టన్నులు అమ్ముడయ్యాయి. నల్గొండ జిల్లాలో 75,216 టన్నులు, సూర్యాపేటలో 73,961 టన్నులు, ఖమ్మంలో 66,061 టన్నులు, మహబూబాబాద్లో 49,122 టన్నులు, కరీంనగర్ జిల్లాలో 41,856 మెట్రిక్ టన్నుల యూరియా అమ్ముడైంది.
ఆసిఫాబాద్ జిల్లాలో గత ఏడాది 5,139 టన్నులు మాత్రమే అమ్ముడుపోగా, ఈసారి 7,792 టన్నుల యూరియా అమ్ముడై 52 శాతం పెరుగుదల నమోదైంది. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలో గత ఏడాది 22,517 టన్నులు కొనుగోలు చేయగా, ఈసారి 29,427 టన్నులు కొనుగోలు చేసి 31 శాతం పెరుగుదల కనిపించింది.
రైతుల స్పందన
చీమలకుంటపల్లి గ్రామానికి చెందిన రైతు గాదె రాజు మాట్లాడుతూ, మొదట్లో యాప్ ఎలా ఉపయోగించాలో తెలియక కంగారు పడ్డామని చెప్పారు. ఇప్పుడు ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని చాలా సులభంగా యూరియా బుకింగ్ చేసుకుంటున్నామని తెలిపారు. గతంలో గంటల తరబడి లైన్లలో నిలబడాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ సమస్య పూర్తిగా తగ్గిపోయిందన్నారు. ఐదు ఎకరాల భూమికి మొదటి విడతగా ఎనిమిది యూరియా బస్తాలను యాప్ ద్వారా తీసుకున్నానని తెలిపారు. యాప్ వల్ల యూరియా పక్కదారి పడకుండా ఎవరి పేరుతో ఎన్ని బస్తాలు తీసుకున్నారో స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు.
