ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఎల్పీజీ సిలిండర్ ధరలు భారీ పెంపు, కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేత
ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం గల్ఫ్ దేశాలపై పడటంతో భారత్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్పై రూ.60, కమర్షియల్ సిలిండర్పై రూ.115 పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పెంపు మార్చి 7 నుంచి అమల్లోకి రావడం గమనార్హం.
ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.853 నుంచి రూ.913కు చేరింది. ఇప్పటికే పెరుగుతున్న ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకు ఈ పెంపు మరింత భారం మోపిందని విమర్శలు వినిపిస్తున్నాయి.
గ్యాస్ ధరల పెంపుతో సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (ట్విట్టర్) లో “Rs 60”, “Rs 115” హ్యాష్ట్యాగ్లు ట్రెండింగ్లో నిలిచాయి. దేశంలో ఇంధన కొరత లేదని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా గ్యాస్ ధరలను పెంచడంపై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. యుద్ధ పరిస్థితులు ఇలాగే కొనసాగితే త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందన్న ఊహాగానాలు మరింత బలపడ్డాయి.
ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంతో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో ఇండస్ట్రీయల్, ఆటోమొబైల్ రంగాలకు గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని సుమారు 2 లక్షల కమర్షియల్ కనెక్షన్లపై ప్రభావం పడనుంది. అలాగే ప్రైవేట్ కంపెనీల సరఫరా వ్యవస్థపై కూడా ప్రభావం చూపనుంది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెలా సుమారు 8 లక్షల కమర్షియల్ సిలిండర్ల సరఫరా జరుగుతుండగా, ఈ నిర్ణయం ఆ సరఫరాకు నేరుగా దెబ్బతీసే అవకాశం ఉంది.
ఒక్క హైదరాబాద్ నగరంలోనే నెలకు 6 నుంచి 6.5 లక్షల కమర్షియల్ సిలిండర్ల విక్రయాలు జరుగుతున్నాయి. టీ స్టాళ్ల నుంచి స్టార్ హోటళ్ల వరకు నెలకు సుమారు 4 నుంచి 5.5 లక్షల సిలిండర్లు అవసరం అవుతాయి. ఇండస్ట్రీలకు అదనంగా మరో 1.5 లక్షల సిలిండర్ల డిమాండ్ ఉంది.
ఈ మొత్తం కమర్షియల్ గ్యాస్ విక్రయాల విలువ నెలకు రూ.140 నుంచి రూ.150 కోట్ల వరకు ఉంటుందని గ్యాస్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. అయితే గత రెండు రోజులుగా బల్క్ ట్యాంకర్ల సరఫరా నిలిచిపోగా, శుక్రవారం నుంచి ఇండస్ట్రీలు మరియు కమర్షియల్ వినియోగాలకు గ్యాస్ సరఫరా పూర్తిగా ఆగిపోయినట్లు సమాచారం.
దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలు, పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. యుద్ధ పరిస్థితులు త్వరగా సద్దుమణగకపోతే దేశంలో ఇంధన సరఫరా మరియు ధరలపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
