హైదరాబాద్లో ఇందిరమ్మ టవర్లు – ఏప్రిల్ నుంచి అర్బన్ హౌసింగ్ పనులకు శ్రీకారం
హైదరాబాద్లో ఇందిరమ్మ టవర్లు – ఏప్రిల్ నుంచి అర్బన్ హౌసింగ్ పనులకు శ్రీకారం
హైదరాబాద్ : రూరల్ ప్రాంతాల్లో శరవేగంగా సాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తర్వాత ఇప్పుడు అర్బన్ ఏరియాలపై హౌసింగ్ శాఖ దృష్టి సారించింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మొత్తం మూడున్నర లక్షల ఇళ్లు మంజూరు కాగా, అందులో రెండున్నర లక్షల ఇళ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
ఇప్పుడీ పథకాన్ని నగర ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జీహెచ్ఎంసీతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జీ ప్లస్ 3 లేదా జీ ప్లస్ 5 ఫ్లోర్లతో “ఇందిరమ్మ టవర్లు” నిర్మించాలని నిర్ణయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఈ పనులు ప్రారంభం కానున్నాయి. ముందుగా జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మాణాలు మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
స్లమ్ ప్రాంతాలపై ఫోకస్
నగరాల్లో సొంత స్థలం లేని అర్హులను గుర్తించి, స్లమ్ ఏరియాలు మరియు ప్రభుత్వ భూములను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లకు హౌసింగ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే వివరాలు సేకరించగా, జీహెచ్ఎంసీలో 19 స్లమ్ ప్రాంతాలు గుర్తించినట్లు సమాచారం. రెవెన్యూ, పురపాలక శాఖలు అనువైన భూములపై సర్వే చేస్తున్నారు.
ఈ టవర్లు గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఉండి, ఒకే చోట వందలాది కుటుంబాలు నివసించేలా రూపుదిద్దుకోనున్నాయి. మురికివాడల్లో నివసించే వారికి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే ప్రధాన లక్ష్యం.
నిర్మాణ విధానం – ఖర్చు అంచనా
గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ సదుపాయం కల్పించి, ప్రతి ఫ్లోర్లో రెండు ఇళ్ల చొప్పున మూడు టవర్లలో మొత్తం 12 ఇళ్ల నిర్మాణం చేపడతారు. ఇళ్లతో పాటు రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించనున్నారు.
ఒక్కో ఇంటి నిర్మాణం, మౌలిక సదుపాయాలతో కలిపి సుమారు రూ.8 లక్షలు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇంటికి ప్రభుత్వం రూ.5 లక్షలు ఖర్చు చేస్తోంది. ఇందులో రూరల్ ప్రాంతాలకు కేంద్రం రూ.72 వేలూ, అర్బన్ ప్రాంతాలకు రూ.1.50 లక్షలు అందిస్తోంది. అదనంగా అవసరమైన రూ.3 లక్షలను ఇతర మార్గాల్లో, ముఖ్యంగా మెప్మా ద్వారా సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
అర్బన్ ప్రాంతాల్లో కూడా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసే ప్రతిపాదనపై ప్రభుత్వం ఆలోచిస్తోంది.
అఫర్డబుల్ హౌసింగ్ పాలసీకి సిద్ధం
రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు తక్కువ ధరలకు ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం “అఫర్డబుల్ హౌసింగ్ పాలసీ” తీసుకురానుంది. వచ్చే నెల బడ్జెట్లో ఈ పాలసీని ప్రకటించే అవకాశం ఉంది. డ్రాఫ్ట్ పాలసీ సిద్ధమైందని సమాచారం.
బిల్డర్లతో త్వరలో సమావేశం నిర్వహించి సూచనలు స్వీకరించనున్నారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా హౌసింగ్ బోర్డు భూముల్లో ఎంఐజీ, ఎల్ఐజీ టవర్ల నిర్మాణం చేపట్టనున్నారు. హౌసింగ్ బోర్డు నోడల్ ఏజెన్సీగా టెండర్లు పిలిచి ప్రైవేట్ బిల్డర్లకు బాధ్యతలు అప్పగించనుంది.
అదనంగా, పారిశ్రామిక ప్రాంతాల్లో శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణానికి కూడా నిధులు కేటాయించాలని హౌసింగ్ శాఖ ఫైనాన్స్ విభాగానికి ప్రతిపాదనలు పంపింది.
ఇలా రూరల్ నుంచి అర్బన్ వరకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని విస్తరించి, రాష్ట్రవ్యాప్తంగా గృహరహితులకు నివాస భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.
