సంక్రాంతి పండుగ రోజు ఆ ఊళ్లో స్నానం చేయరు.. దీపాలు వెలిగించరు.. సంబరాలకు దూరంగా ఉంటారు.. ఎందుకంటే..!
సంక్రాంతి వచ్చిందంటే అంటే నెల రోజుల ముందు నుంచే సిటీ జనాలు సొంతూరు వెళ్లి సంబరాలు చేసుకొనేందుకు ముందే టికెట్ బుక్ చేసుకుంటారు. ఇంటిల్లపాది పట్నం దాటి పల్లెకు వెళ్లాల్సిందే. దేశమంతా సెలబ్రేషన్స్ మోడ్ లో ఉన్నా తెలుగు రాష్ట్రాల్లోని ఓ గ్రామం మాత్రం సంక్రాంతి సంబరాలకు దూరంగా ఉంటుంది. అంతే కాదు.. కనీసం స్నానం చేయరు.. దీపాలు వెలిగించరు.. ఇంతకూ ఆగ్రామం ఎక్కడ ఉంది. ఎందుకు ఆ గ్రామంలో జనాలు సంక్రాంతి సంబరాలకు దూరంగా ఉంటారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
సంక్రాంతి వచ్చిందంటే చాలు జనాలు సంబరాల్లో మునిగి తేలుతారు. తెలుగురాష్ట్రాల్లో అతి పెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఈ పండుగకు వృత్తి, వ్యాపార రీత్యా ఇతర దేశాలు… రాష్ట్రాల్లో స్థిరపడిన వారు సొంతూరుకు వచ్చి సంబరాలు చేసుకుంటారు.
కాని ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో పి. కొత్తపల్లి గ్రామంలో మాత్రం సంక్రాంతి సంబరాలు చేసుకోరు. కనీసం ఆ రోజు ఇల్లు ఊడవరు.. స్నానం చేయరు. అసలు ఆ గ్రామంలో మాత్రం అసలు పండగ వాతావరణమే కనిపించదు. దేశమంగా సంక్రాంతి సంబరాల్లో మునిగిపోతుండగా.. పి.కొత్తపల్లి వాసులు మాత్రం మామూలు రోజుకంటే సాధారణంగా ఉంటారు.
ఎక్కడ ఉందంటే..
ఆత్మకూరు నుంచి కల్యాణదుర్గం వెళ్లే మార్గంలో పి.కొత్తపల్లి గ్రామం ఉంది. 300 కుటుంబాలున్న ఈ గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా సంక్రాంతి పండుగను జరుపుకోవడం లేదు. సంక్రాంతిని ఎందుకు జరుపుకోవడం లేదంటే.. ఆ పి.కొత్తపల్లి గ్రామస్తులు తమ పూర్వీకులు చెప్పిన ఒక కథను ఒకదానిని చెబుతుంటారు.
వెళ్లిన వాళ్లు.. వెళ్లినట్లే..
చాలా సంవత్సరాల క్రితం పి.కొత్తపల్లి గ్రామంలో కూడా అందరిలాగానే సంక్రాంతి పండగను జరుపుకునే వారని.. అయితే అలా ఒకసారి సంక్రాంతి పండగ కోసం సరుకులు కొనుగోలు చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తి ఆత్మకూరు సంతకు వెళ్లగా…అక్కడ ఉన్నట్టుండి ఆ వ్యక్తి అక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనను అందరూ సాధారణ ఘటనగానే భావించారు. కానీ ఆ తర్వాతి రోజు అలాగే సంతకు వెళ్లిన మరో ముగ్గురు కూడా అలానే మరణించారు.
దీంతో ఆ గ్రామస్థుల్లో భయం మొదలైంది. ఆ తర్వాత వరుసగా పండగకు సంతకు వెళ్లిన వాళ్లు.. వెళ్లినట్లే ప్రాణాలతో తిరిగి రాకపోవడంతో వారికి సంక్రాంతి అంటే భయం మొదలైంది. అప్పటి నుంచి సంక్రాంతి పండుగ చేసుకుంటే తమ గ్రామస్థులకు ఏదో ఒక అనర్థం జరుగుతుందని గ్రామవాసులు భయపడిపోయారు. అప్పట్నుంచి తమ ఊళ్లో సంక్రాంతి పండగను జరుపుకోవద్దని గ్రామపెద్దలు తీర్మానించుకున్నారు.
తరాలు మారినప్పటికీ.. అప్పుడు తమ గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని పి.కొత్తపల్లి గ్రామస్థులు ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు. తమ పూర్వీకులు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ వారు ఇప్పటికీ సంక్రాంతి పండుగ జరిగే మూడు రోజుల పాటు ఇల్లు, వాకిలిని శుభ్రం చేసుకోరు. ఇంటి ముందు ముగ్గులు వేయరు. పిండి వంటలు చేసుకోరు.
టీ కొత్తపల్లి గ్రామస్తులు సంక్రాంతి పండుగను జరుపుకోవడమే మానేయడం వినడానికి కాస్త విచిత్రంగానే ఉన్నా.. ఇది నిజం..! అలా సంక్రాంతికి పండుగకు దూరంగా పి. కొత్తపల్లి గ్రామం ఉండడం విశేషం..!
