ఆ రెండు పథకాలను ఈ నెల 12న ప్రారంభించనున్న సీఎం
తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల అభ్యున్నతే లక్ష్యంగా మరో ముందడుగు వేస్తోంది. రాష్ట్రంలోని దివ్యాంగులు, వృద్ధులు, చిన్నారుల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భాల భరోసా, ప్రణామం పథకాలను ఈ నెల 12న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
దివ్యాంగుల సాధికారత కోసం ప్రభుత్వం రూ. 50 కోట్లు కేటాయించింది. దీనిలో భాగంగా రూ. 43.22 కోట్ల విలువైన సహాయక పరికరాలను 7 వేల మంది అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాలు, బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు, ల్యాప్టాప్లు, వినికిడి యంత్రాలు, మొబైల్ ఫోన్లు అందించనున్నారు. దివ్యాంగుల సహకార సంస్థ ఏర్పాటైన తర్వాత ఒకే ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయిలో నిధులు కేటాయించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
ప్రణామం- వృద్ధుల కోసం మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్లు
వృద్ధుల మానసిక ఉల్లాసం, సంరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 37 ప్రణామం డే కేర్ సెంటర్లను ప్రభుత్వం మంజూరు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, హన్మకొండ జిల్లాల్లో రెండేసి చొప్పున, మిగిలిన 29 జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పనిచేసే ఈ కేంద్రాల్లో లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, టీవీ, ఇంటర్నెట్ సదుపాయంతో కూడిన కంప్యూటర్లు ఉంటాయి. లబ్ధిదారులకు ఉచితంగా స్నాక్స్ తో పాటు వేడి వేడి భోజనం అందిస్తారు. ప్రతి సెంటర్ ఏర్పాటు, నిర్వహణ కోసం ప్రభుత్వం రూ. 12.48 లక్షలు మంజూరు చేసింది.
చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం బాల భరోసా:
ఐదేళ్ల లోపు చిన్నారుల్లో వైకల్యాలను ముందస్తుగా గుర్తించి, తగిన చికిత్స అందించడమే లక్ష్యంగా ‘బాల భరోసా’ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అంగన్వాడీ టీచర్లు ప్రాథమిక స్క్రీనింగ్ నిర్వహిస్తారు. సమస్యలు ఉన్నట్లు గుర్తించిన పిల్లలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేదా ఆర్బీఎస్కే ద్వారా వైద్య పరీక్షలకు పంపిస్తారు. అవసరమైన పిల్లలకు ఉచితంగా శస్త్రచికిత్సలు, థెరపీ, పునరావాస సేవలను ప్రభుత్వం అందిస్తుంది. దీని ద్వారా వైకల్య రహిత తెలంగాణను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
