గజ గజా వణికిస్తున్న చలి.. రానున్న రెండ్రోజులు నరకమే, హెచ్చరికలు జారీ
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి పులి పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతుండటంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
ముఖ్యంగా ఏజెన్సీ, అటవీ ప్రాంతాల్లో చలి తీవ్రత భీభత్సంగా ఉంది. కుమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 3 డిగ్రీల సెల్సియస్కు పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పట్టణ ప్రాంతాల్లో కూడా సగటున 7 నుంచి 13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం నాటి లెక్కల ప్రకారం మెదక్లో 7.9, సంగారెడ్డిలో 7.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదై ప్రజలను వణికించాయి.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికల ప్రకారం.. రానున్న రెండు రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఆదివారం, సోమవారం రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మరో 2 నుంచి 3 డిగ్రీలు తగ్గే సూచనలు ఉన్నాయి. ఉత్తర భారతం నుండి వీస్తున్న పొడి గాలుల కారణంగా రాష్ట్రంలో శీతల గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. పొగమంచు కారణంగా తెల్లవారుజామున వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, దృశ్యమానత తగ్గడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
వాతావరణంలో హఠాత్తుగా వచ్చిన మార్పుల వల్ల ప్రజల రోగనిరోధక శక్తి క్షీణిస్తోంది. దీనివల్ల అంటువ్యాధులు వేగంగా వ్యాపిస్తున్నాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారికి ఈ చలి కాలం అత్యంత కష్టతరంగా మారింది. గాలి ద్వారా వ్యాపించే వైరస్లు చల్లని వాతావరణంలో ఎక్కువ కాలం జీవించి ఉండటం వల్ల ఫ్లూ జ్వరాలు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఈ వాతావరణ మార్పులకు త్వరగా గురవుతున్నారు. వారిలో శరీర ఉష్ణోగ్రత వేగంగా తగ్గిపోవడం వల్ల ‘హైపోథెర్మియా’ వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి.
అత్యవసరమైతే తప్ప తెల్లవారుజామున, రాత్రి 8 గంటల తర్వాత బయటకు రావద్దు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా ఉన్ని దుస్తులు, మఫ్లర్లు, గ్లౌజులు ధరించాలి. ఎల్లప్పుడూ వేడిగా ఉండే ఆహారం, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచే అల్లం, వెల్లుల్లి, పసుపు వంటి పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలి. చలి వల్ల చర్మం పొడిబారి పగుళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మాయిశ్చరైజర్లు లేదా కొబ్బరి నూనెను ఉపయోగించడం మంచిది. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు చలిలో అధిక శ్రమ చేయకూడదు. ఎందుకంటే చలి కాలంలో రక్తనాళాలు కుంచించుకుపోయి రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది.
