శాఖల పనితీరు మరింత మెరుగుపర్చాలి: కార్మిక, ఉపాధి శాఖల అధికారులకు మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి ఆదేశాలు
కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి గురువారం సచివాలయంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కార్మిక, ఉపాధి, ఫ్యాక్టరీలు మరియు ఈఎస్ఐ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల పనితీరు, సేవలను మరింత మెరుగుపర్చాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా శాఖల వారీగా సమీక్ష నిర్వహించిన మంత్రి, రాబోయే ఏడాదికి స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించారు. ఉపాధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో (ATCs) కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత కోర్సులతో పాటు కొత్త నైపుణ్యాభివృద్ధి కోర్సులను ప్రారంభించాలని సూచించారు. యువతకు మరింత ఉపాధి అవకాశాలు కల్పించేలా అన్ని కోర్సులు ప్రస్తుతంతో పాటు భవిష్యత్ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు.
కార్మికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన డా. వివేక్ వెంకటస్వామి, పరిశ్రమలలో ప్రమాదాలు జరగకుండా ఫ్యాక్టరీల శాఖ భద్రతా ప్రమాణాలు, సన్నద్ధతను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. సిగాచీ ఘటన వంటి సంఘటనలను ప్రస్తావిస్తూ, కార్మికుల భద్రత, సంక్షేమంలో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టంచేశారు.
అదేవిధంగా ఈఎస్ఐ శాఖ పనితీరును కూడా సమీక్షించిన మంత్రి, ఇన్స్యూర్డ్ పర్సన్స్ (IPs) కు నాణ్యమైన వైద్య సేవలు అందేలా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఐపీల నుంచి ఫిర్యాదులు రావడం సహించబోమని హెచ్చరించిన ఆయన, అవసరమైన చోట అదనపు డిస్పెన్సరీలు ఏర్పాటు చేసి వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని సూచించారు.
నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపేందుకు వివిధ శాఖల అధికారులు సచివాలయంలో మంత్రి డా. వివేక్ వెంకటస్వామిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి శుభాకాంక్షలను స్వీకరిస్తూ, అధిక బాధ్యతతో, నిబద్ధతతో పనిచేయాలని అధికారులకు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానా కిషోర్, ఉపాధి మరియు శిక్షణ శాఖ డైరెక్టర్ శ్రీమతి కాంతి వెస్లీ తదితరులు పాల్గొన్నారు.
