గిరిజన కుంభమేళా.. మేడారం!
మేడారం… ఆ పేరులోనే ఒక మహత్తు, పులకింత, చైతన్యం, ధిక్కారం ఉన్నాయి. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతర నిర్వహణ జిల్లా పాలనా యంత్రాంగానికి ఒక పెద్ద సవాల్. దాదాపు కోటి మందికి పైగా గిరిజనులు, గిరిజనేతరులు హాజరయ్యే ఈ జాతర గిరిజన సంస్కృతీ, సాంప్రదాయాలను ఇప్పటికీ పాటిస్తూ ప్రత్యేకంగా నిలిచింది. ఒక అటవీ కుగ్రామంలో మౌలిక సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉన్న ప్రాంతంలో జరిగే ఈ జాతరను గిరిజన కుంభమేళాగా అభివర్ణిస్తారు. ఈ జాతరకు హాజరయ్యే భక్తజన కోటికి పాలనా యంత్రాంగం చేసే ఏర్పాట్లు ఏమాత్రం సరిపోవు. అయినప్పటికీ ఏమీ ఆశించకుండా కేవలం ఆ తల్లుల దర్శనం చేసుకుంటే చాలు అనుకుకుంటారు భక్తులు. ఎంతోమంది ఎడ్ల బండ్లలో మేడారానికి వచ్చి కనీసం మూడు రోజులు బస చేస్తారు.
పీఆర్వో కోణంలో చెప్పాలంటే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ల కోసమే ఈ జాతర. నిరంతరం ప్రతి సూక్ష్మ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తారు. ఈ జాతర కవరేజీకి డీపీఆర్వో కార్యాలయం నుంచే దాదాపు వెయ్యి మీడియా పాస్లు జారీచేయడం, దానికితోడు మరో రెండు వందలకు పైగా దేశ, విదేశీ జర్నలిస్టులు కవరేజీ చేస్తారు. జాతరపై అధ్యయనం చేసేందుకు, జాతర అంశాలను తమ కెమెరాల్లో బంధించేందుకు ఎంతోమంది వస్తారు. మేడారం జాతరలో మీడియా మేనేజ్మెంట్ అనేది అత్యంత ప్రధానమైనది, కీలకమైనది, సంక్లిష్టమైనది.
మతాలు, దేశాలు, పద్ధతులు వేరైనా సరే జాతరలు సహజంగా జరిగేవే. కానీ, ఏ జాతరకూ లేని ప్రత్యేకతలు, అన్ని జాతరల్లో కనిపించే విశిష్టతలు మేడారంలో కనిపిస్తాయి. గలగల పారే సెలయేటిలో పుణ్యస్నానాలు చేసే కుంభమేళా లాంటి దృశ్యాలు ఇక్కడా కనిపిస్తాయి. గణగణ మోగే గంటలు హిందూ దేవాలయాలు, క్రైస్తవ చర్చిలో వాతావరణాన్ని ప్రతిధ్వనిస్తాయి. కొండకోనల మధ్య జనసందోహం శబరిమలను తలపిస్తుంది. తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించే మరో తిరుమల ప్రత్యక్షమవుతుంది. యుద్ధభూమిలో నేలకొరిగిన జాతి రత్నానికి భక్తకోటి నివాళులు అర్పించే మరో జకార్తా. దైవత్వం సంతరించుకున్న మానవత్వం పుట్టిన మరో జెరూసలేం. ఇవన్నీ మనకు ఇక్కడ కనిపిస్తాయి.
ఈ జాతర కేవలం కోయల సంప్రదాయాలను గౌరవించడం, గుర్తించడం వరకు మాత్రమే పరిమితం కాదు. నమ్మిన జనం కోసం ప్రాణమైనా ఇవ్వాలనే ఓ సందేశం కూడా అంతర్లీనంగా ఉంటుంది. యుద్ధంలో గెలిచిన కాకతీయులు సామ్రాజ్యాన్ని విస్తరించుకుని చక్రవర్తులయ్యారు. పోరాటం చేసిన మేడరాజులు మాత్రం దేవుళ్లు అయ్యారు. ఇంతటి గొప్ప జాతర నిర్వహణలో భాగస్వామ్యం కావడం గొప్ప అవకాశం. ఏపీపీఎస్సీ ద్వారా 1993లో సమాచార పౌర సంబంధాల శాఖలో చేరాను. సహాయ పౌర సంబంధాల అధికారిగా వరంగల్లో జాయిన్ అయ్యాను. 1994 నుంచి మేడారం జాతర విధులు నిర్వర్తించాను.
2014 వరకు ప్రతీ జాతరకు ములుగు డివిజనల్ పీఆర్వోగా, వరంగల్ డీపీఆర్వోగా మేడారంలో మీడియా సెంటర్ ఇంచార్జిగా భాద్యతలు నిర్వర్తించాను. పదోన్నతిపై హైదరాబాద్కు వెళ్లినప్పటికీ ప్రతీ జాతరకు తప్పనిసరిగా వెళ్తూ గిరిజన సంస్కృతీ, సాంప్రదాయాలు, మొక్కులు, జాతర జరిగే తీరు, వివిధ రాష్ట్రాలనుంచి వచ్చే గిరిజన జాతుల సంస్కృతీ సంప్రదాయాలు, మీడియా కవరేజీ, జాతరలో ఎదురయ్యే ఇబ్బందులు… ఇలా భిన్న అంశాలను ఒకచోట చేర్చి ‘సమ్మక్క.. ద గ్లోరీ ఆఫ్ మేడారం’ అనే పేరుతో పుస్తకం ముద్రించడం జరిగింది. ఇది నేను రాసిన వ్యాసాల సంకలనం.
