wedding: పెళ్లైన తొలి రాత్రే భయంతో వరుడు పరారీ

మేరఠ్: వివాహం జరిగిన తొలి రోజే వరుడు భయంతో ఇంటి నుంచి పారిపోయాడు. రాత్రి వేళ మానసిక ఆందోళనకు గురైన మోను (26) అనే యువకుడు అదృశ్యమైన ఘటన యూపీ(Uttar Pradesh)లో వెలుగుచూసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మూడు రోజుల తర్వాత హరిద్వార్లో అతడి ఆచూకీని గుర్తించి కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
శారధన పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంచాపుర్కు చెందిన మోను నవంబర్ 27న రాత్రి అదృశ్యమయ్యాడు. విద్యుత్ బల్బు తీసుకొస్తాననే నెపంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన వరుడు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించగా రాత్రి గంగా నదీ ఒడ్డున తిరుగుతూ కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ఎంత వెతికినా అతడి జాడ కనబడలేదు. సోమవారం వేరొకరి ఫోన్ నుంచి మోను తన తండ్రికి కాల్ చేసి తాను సురక్షితంగానే ఉన్నానని, ఇంటికి తిరిగి రావాలనుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో అతడి తండ్రి, బంధువులతో కలిసి మేరఠ్ పోలీసులు హరిద్వార్ వెళ్లి రైల్వే స్టేషన్ సమీపంలో మోనును గుర్తించారు. అనంతరం పోలీసులు అతడిని ప్రశ్నించగా.. పెళ్లి రోజు రాత్రి భయాందోళనకు గురై హరిద్వార్ బస్సు ఎక్కానని, అక్కడే స్టేషన్ ప్రాంతంలో తిరుగుతూ గడిపినట్లు చెప్పాడు.
అయితే, వివాహం జరిగిన రోజే స్నేహితుల కోరిక మేరకు అతడు ఏదో తిన్నాడని పోలీసులు చెబుతున్నారు. స్నేహితుల సలహాతో ఆరోజు ఒకరకమైన మెడిసిన్ తీసుకొని ఉండొచ్చని, దాని ప్రభావం వల్లే మానసిక అశాంతికి గురై ఉంటాడని భావిస్తున్నారు. విచారణ అనంతరం మోనును కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించినట్లు పోలీసు అధికారి అశుతోష్ వెల్లడించారు. మోను సహజంగానే భయస్థుడిలా ఉన్నాడని, అతడు ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదని మీడియాకు తెలిపారు.
